5, నవంబర్ 2012, సోమవారం

రావిశాస్త్రి "ఇల్లు"



రచన: ఎస్.కె. బాబు
విజయనగరం



ఇల్లు

కొందరికి అది ఉండడానికి గూడు.

మరికొందరికి అది సంపాదించవలసిన ఆస్థి

రాచకొండ విశ్వనాధ శాస్త్రిగారి ఆఖరి రచన. ఇల్లు  నవల. యీ నవల సోమయాజులనే కౌన్సిలర్ చిట్టెమ్మకు పరిచితుడు. అనంతుకు ఇల్లు ఖాళీ చెయ్యమని నోటీసు ఇప్పిస్తాడు. లేనిపోనివన్ని చిట్టెమ్మ బుర్రకెక్కించి దావా వేయించి ఇంటిని ఖాళీ చేయాలని చూస్తాడు. దావా కాయితాలని చెప్పి, క్రయపురోణి వ్రాయించుకుంటాడు సోమయాజులు.

సోమయాజులు లాయరు నోటీసు, చిట్టెమ్మకు నక్సల్స్‌కు సంబంధం ఉందన్న ఆరోపణ, వీటితో సతమతమై భయంతో ఇంటిని ఎంతకో కొంతకి అమ్మెయ్యాలని నిశ్చయించుకొని, సోమయాజులు మనోహరం అనే కాంట్రాక్టర్, యెస్.పి అల్లుడు నానురువు వెరశి సోమనా ఎంటర్‌ప్రైజస్ వార్కి దాఖలు పరుస్తుంది.

ఏ స్వార్థమూ లేని చిట్టెమ్మ నిలవనీడ లేనిదై కాశీకి ప్రయాణం అవుతుంది.

రావిశాస్త్రిగారు నవల నిండా సామాజిక రుగ్మతల మీద వ్యవస్థను పతనం చేస్తున్న వ్యక్తుల మీద విసుర్లు వేసారు. అలాగే కులవ్యవస్థని కూడా నిర్మొహమాటంగా తూర్పారబట్టారు.

ముందుమాటలో రావిశాస్త్రిగారే అంటారు. యీ నవలను కొంచెం భయంతోనూ, కొంత భక్తితోనూ, నిజాయితీ కూడా రాసేనని అనుకుంటున్నాను. యీ నవల్లోని ఓ చోట మంచితనం గురించి చెపుతూ

మంచితనం ఎక్కడ దాగి ఉంటుందో చెప్పడం కష్టం
తియ్యటి మామిడి పండులో తినరాని జీడి ఉన్నట్లే
తినరాని జీడిపిక్కల్లో తియ్యటి పలుకులుండొచ్చు.

సహజంగానే రావిశాస్త్రిగారి రచనలు నేటివిటిని కలిగి వుంటాయి. యీ నవల పూర్తి నేటివిటితో, చాలా హృద్యంగా సాగుతుంది. రావిశాస్త్రిగారి రచనలన్నీ బడుగు వర్గాల దయనీయ స్థితి, ఆ స్థితికి వారిని నెట్టేస్తున్న పరిస్థితులు, తేటతెల్లం చేస్తూ పూర్తి వామపక్ష భావజాలంతో రచనలన్నీ సాగుతాయి.

స్వతహాగా రావిశాస్త్రిగారు లాయరుగా ప్రాక్టీసు చేయడం వలన వీరికి సమాజంలో దోపిడిని, దోపిడికి గురౌతున్న విధానాలు తేటతెల్లంగా తెలిసిరావడంతో వీరి రచనలు అన్ని దోపిడి వర్గాల మీది పోరాట పటిమతోనే వ్రాయబడ్డాయి.

సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల, తలుపుగొళ్లెం, హారతిపళ్లెం కాదేదీ కవిత కనర్హం అని శ్రీ శ్రీ అంటే కధకు కూడా అనర్హం కాదంటూ, రావిశాస్త్రిగారు  ఋక్కులు,  పేకిట, సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల అంటూ ఒక్కొక్క పేరుతో కధలు వ్రాసారు. గోవులొస్తున్నాయి జాగ్రత్త పేరుతో యీ సంకలనం వచ్చింది.

అలాగే ఆరు సారా కధలు, పిపీలకం, మూడు కధల బంగారం వగయిరా కధలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.
ఇటీవలే రావిశాస్త్రి రచనలన్నీ ఒకే గ్రంధంగా రావిశాస్త్రి రచనా సాగరం అంటూ విడుదల అయ్యింది.
1922వ సంవత్సరంలో జులై 30న జన్మించిన రావిశాస్త్రి విశాఖలో ఎంతో కాలం లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. సాహితీరంగంలో పలువురు ప్రముఖులతో ఎంతో సన్నిహిత బంధాలు ఉన్న రావిశాస్త్రిగారు 1993 నవంబరు 10న యీ లోకాన్ని విడిచి వెళ్లారు. వారి రచనలు వారిని అజరామరం చేశాయి.


                                                     ******************************

2 కామెంట్‌లు:

  1. మిత్రమా, యువస్పందన , పత్రిక బాగుంది, రావిశాస్త్రి ఇల్లు నవల సమీక్ష బవుంది. అదేపదివేలు కవిత లొ ఓజీవితం కావ్యం లాకనిపిస్తుంది పత్రిక తెస్తున్నందుకు అభినందనలు
    సుబ్బ లక్ష్మి ,
    తనూజ్
    ,తరున్
    బెంగులూరు

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు. మంచి తెలుగు సాహిత్యాన్ని అందించాలననే మా ప్రయత్నంలో మీలాంటి వారందరి సహకారాన్ని ఆశిస్తూ........

    రిప్లయితొలగించండి