15, నవంబర్ 2012, గురువారం

మనసులో మాట



రచన : బసు పోతన                                  

మనిషి మరో మనిషి కోసం బ్రతకడం వేరు. తనకోసమే తను బ్రతకడం వేరు. మారుతున్న జీవన పరిస్థితుల నేపధ్యంలో పరాయీకరణ పాఠాన్ని వల్లె వేసుకుంటూ తన కోసమే తను బ్రతికే ప్రాధాన్యంలో మనిషి నుండి మనిషి దూరమై పోతున్నాడు. మరణం కూడా మెటీరియలిస్టిక్‌గా, మనసులు యంత్రాలుగా పని చేస్తున్న ఈ సందర్భంలో "ఆనందమంటే డబ్బు, ఎదగడమంటే  బంధాలనుండి విడిపోవడమే" అన్న ధోరణి పాతుకుపోయింది.

పిల్లలు ఎదుగుతున్న సందర్భంలో తల్లితండ్రులు, బంధువులు నేర్పుతున్న పాఠాలు బాగా సంపాదించడమే (జీతమే) జీవితం, పెద్ద స్థాయిలోకి వెళ్లడమే.. మరీ ముఖ్యంగా నీ బంధువులలో అందరికన్నా పైన ఉండడమే విజయం అని నేర్పడం వల్ల ఎదిగిన తర్వాత అవి అందుకునే క్రమంలోనే పరిగెడుతున్నారు. ఆ పరుగులో అసలైన ఆనందాన్ని తమ ఇష్టాల్ని కోల్పోతున్నారు. ఈ రోజుల్లో డబ్బు సంపాదనతో పాటు తమకు ఇష్టమైన వ్యాసంగంలో గడిపేవాళ్లు ఎంతమంది?

ప్రతీ మనిషిలోనూ ఒక కళ  ఉంటుంది. ఆ కళని మనలో మనం బ్రతికించినప్పుడు. అది మనల్ని బ్రతికిస్తుంది. ఆనందింప చేస్తుంది. తమలోని కళకు జీవాన్ని పోస్తూ, తమ జీవితాన్ని ఆనందిస్తున్న ఎంతోమంది కళాపిపాసులు, సాహితీ ప్రియులు ఉన్నారు. వారిని ఓ చోట చేర్చి మరికొంత మందిని ఆనందింప చేయటమే మా ఈ పత్రికా  ప్రయత్నం.   యువస్పందన  వెనకాల 33 సంవత్సరాల హృదయ స్పందన ఉంది. 8వ తేది ఏప్రిల్, 1978 సంవత్సరంలో శ్రీ  రామసూరి మాస్టారు స్థాపించిన  ఈ సంస్థ విజయనగరం సిగలో ఒక సాహితి కుసుమమై వికసించింది.

125 వ గురజాడ జయంతి సందర్భంగా శ్రీ శివారెడ్డి అధ్యక్షతన అఖిలాంధ్ర కవి సమ్మేళనం అలాగే అంత్యాకుల రాజేశ్వర రావు చిత్ర కళా  ప్రదర్శన, ఆకుంది సాయి రామ్ కార్టూన్ చిత్ర కళా ప్రదర్శన, ఆకాశవాణి జాతీయ యువ సంగీత కళాకారులు ఇంద్రగంటి సరస్వతి, భల్లమూడి సరళ ల శాస్త్రీయ సంగీత కచేరి వంటి కార్యక్రమాలు నిర్వహించింది.

శ్రీ చాసో, డాక్టర్ సి నారాయణ రెడ్డి, పురాణం సుబ్రహ్మణ్య శర్మ, ఆరుద్ర  వంటి ఉద్దండులతో యువస్పందన సాహిత్య సమావేశాలు నిర్వహించింది.  వేల్చేరు నారాయణ రావు (USA), డాక్టర్ గూటాల కృష్ణ మూర్తి (London), వాకాటి పాండురంగారావు, కుందుర్తి, శ్రీపతి, వాడ్రేవు చిన వీరభద్రుడు, శీల వీర్రాజు, రోణంకి అప్పలస్వామి,  డాక్టర్ U A నరసింహ మూర్తి, డాక్టర్ చాగంటి తులసి వంటి సాహితి వేత్తలు తమ ప్రసంగాలతో యువతలో ఓ ఊపు, కొత్త చూపు అందించారు. ఈ కార్యక్రమాలన్నిటికీ యువస్పందన వేదికగా నిలిచింది. ఉన్నవ లక్ష్మీ నారాయణ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చలం, స్థానం నరసింహ రావు, వంటి రచయితల / కళాకారుల శతజయంతి ఉత్సవాలకి వేదికైంది.

ప్రతినెల జరిగే కార్యక్రమాలలో భాగంగా యువకవులు 30 పుస్తకాలు సమీక్షించారు. ఈ కార్యక్రమాలు గురజాడ గృహంలో నిర్వహించి సాహితి సౌరభాలను మరింత పంచింది యువస్పందన. ఆ సాహితి పిపాసను, ఆ ఆకాంక్షల సౌరభాలను మారుతున్న కాలంతో మరింత మందికి అందించాలని సరికొత్త సాంకేతిక మాద్యమాలను అలవర్చుకుని ప్రయాణాన్ని ప్రారంభించింది యువస్పందన. ఈ ప్రయత్నంలో నాకు వెన్నుదన్నుగా ఉన్న మా గురువుగారు రామసూరి " మాస్టారుగారికి ఎంతో ఋణపడి ఉన్నాను. అలాగే శ్రీ మురళీధర్ రావుగారికి, శ్రీమతి జ్యోతి వలబోజు గారికి కూడా కృతజ్ఞతలు.  తమ రచనలను ఇచ్చిన కవులకి , రచయితలకి మనఃపూర్వక ధన్యవాదములు. యువస్పందన ఉరకలు వేసే యువరక్తానికి ప్రాధాన్యత  యిస్తూ, అనుభవంగల పెద్ద తరానికి పెద్ద పీట వేస్తూ సాహిత్యం, సాంస్కృతిక విలువల తెలుగు ప్రత్రికగా నిలబెట్టాలని మా ఆకాంక్ష.   ఈ ప్రయత్నంలో నా వెన్ను దన్నుగా ఉన్న మా గురువుగారు శ్రీ రామసూరి మాస్టారికి నేను ఎంతో ఋణపడి ఉంటాను.

ఈ పత్రిక సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ, మనిషిలోని ఆనందాల అంతరంగాల్ని వెలికి తీయాలనే ఆశయంతో ప్రతీ మూడు  నెలలకు ఒకసారి వెలువరిస్తామని తెలియచేస్తున్నాను. మా ఈ ప్రయత్నంలో పాల్గొన్న, పాల్గొంటున్న వారందరికీ నమస్కారములతో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి